అతివిశ్వాసమే మా కొంపముంచింది : యూపీ సీఎం ఆదిత్యనాథ్

గురువారం, 15 మార్చి 2018 (16:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్‌పూర్‌, ఫుల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఈ ఫలితాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. 
 
"అతివిశ్వాసానికి పోవడమే మా కొంపముంచింది. మేం అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ జతకట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయి. ఇదే మా ఓటమికి దారి తీసింది. ఈ రెండు పార్టీల పొత్తును మేం తక్కువ అంచనా వేశాం" అంటూ బదులిచ్చారు. 
 
అలాగే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, "బీజేపీపై ఓటర్లు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఈ ఫలితాలు రుజువు చేశాయి. గెలిచే అవకాశాలు ఉన్న బీజేపీయేతర అభ్యర్థికి ఓటు వేస్తారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. ఇది రాత్రికి రాత్రి జరిగే పని కాదు" అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, "ఈ (బీజేపీ) ప్రభుత్వం ప్రజలను నానాకష్టాల పాల్జేసింది. భయభ్రాంతులను చేసింది. అచ్చేదిన్‌ అని ఆటాడుకున్న బీజేపీకి ప్రజలు తగిన శాస్తి చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. దళితులు, రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగుల మద్దతే సమాజ్‌వాదీ విజయానికి కారణం. ఇది సామాజిక న్యాయం సాధించిన విజయం. మాకు మద్దతు ఇచ్చిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు'' అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు