సాధారణంగా రోప్ వే సేవలు హిల్ స్టేషన్లు, పర్వత ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటాయి. సులభతరమైన రవాణా సేవల కోసం ఈ తరహా మార్గాలను నిర్మిస్తారు. అయితే, తాజాగా దేశంలోని తొలి అర్బన్ రోప్ వే అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం రూ.807 కోట్లను ఖర్చు చేశారు. మొత్తం 3.75 కిలోమీటర్ల దూరాన్ని ఈ రోప్ వే మార్గంలో కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ రోప్ వే సేవలు రోజుకు 16 గంటల పాటు అందించేలా డిజైన్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో అర్బన్ రోప్ వే సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కొన్ని రోజుల క్రితమే ఈ రోప్ వే సేవల ట్రయల్ రన్ను ప్రారంభించారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది అమల్లోకి వస్తే వారణాసి నగరంలో రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రద్దీని తగ్గించి, వివిధ ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలను పెంచుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.807 కోట్లు. నగర రవాణాను మెరుగపరచడమేకాకుండా, ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంట్, రథ్ యాత్ర ప్రాంతాల మధ్య. 3.75 కిలోమీటర్ల దూరానికి ఒక రోప్ కారును తిప్పుతున్నారు. 15 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్లో భాగంగా, మరిన్ని రోప్ కార్లను నడుపుతామని పేర్కొన్నారు. ఇందుకోసం కాంట్, విద్యాపీఠ్, రథ్ యాత్ర వద్ద స్టేషన్లు నిర్మించారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వీల్ చెయిర్ ర్యాంపులు, రెస్ట్ రూములు, పార్కింగ్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, కేఫ్లు, దుకాణాలు కూడా ఈ స్టేషన్లలో ఏర్పాటు చేశారు.