లాక్‌డౌన్‌తో బతికిపోయాం.. లేకుంటేనా దేశంలో లక్షల్లో కరోనా కేసులు!?

ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (09:39 IST)
మన దేశంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, శనివారం ఒక్క రోజే ఏకంగా 1035 కేసులు నమోదయ్యాయి. అలాగే, శనివారం ఒక్క రోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాకు బలైన వారి సంఖ్య 242కు చేరింది. దేశంలో శనివారం రాత్రి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7529గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో లాక్‌డౌన్‌ను దేశంలో పటిష్టంగా అమలు చేస్తున్న కారణంతో కేసుల సంఖ్య అదుపులో ఉందని, లేకుంటే ఈపాటికి 2.08 లక్షలకు, ఈ నెల 15 నాటికి 8.2 లక్షలకు చేరుండేదని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలోని 486 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందుతోందని, లక్షకు పైగా ఐసొలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 
 
ఇదేసమయంలో కరోనా చికిత్సకు వాడుతున్న మలేరియా నివారిణి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ఎలాంటి కొరతా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఓ డాక్టర్ సహా 11 మందికి పాజిటివ్ రావడంతో, ఆ ఆసుపత్రిని తాత్కాలికంగా మూసేశామని చెప్పుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది మొత్తాన్ని ఐసోలేషన్‌కు తరలించినట్టు తెలిపారు. 
 
ఇదేసమయంలో 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లో మాత్రమే 80 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి హర్షవర్ధన్  వ్యాఖ్యానించారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఇంకా కొందరు అజ్ఞాతంలోనే ఉండి, కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వెల్లడించిన ఆయన, అటువంటి వారి ఆచూకీ చెబితే, రూ.5 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు