భారీ వర్షాలతో రైల్వే శాఖ అప్రమత్తం : 14 రైల్లు రద్దు

శనివారం, 24 జులై 2021 (09:54 IST)
రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రైళ్ళ రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. 
 
సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని ఇగత్‌పరి - లోనావాలా, కొల్హాపూర్ - మిరాజ్ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో 14 రైళ్లను రద్దు చేసింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు నాలుగు రైళ్లను ఒక్కో రోజు రద్దు చేయగా, మిగతా పది రైళ్లను నాలుగు రోజుల చొప్పున రద్దు చేశారు.
 
ఈ నెల 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్ - తిరువనంతపురం, చండీగఢ్ - కొచ్చువేళి, హిస్సార్ - కోయంబత్తూరు రైళ్లతోపాటు, ముంబై - తిరువనంతపురం మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు. 
 
శుక్రవారం బయల్దేరాల్సిన తిరుపతి - కొల్హాపూర్, 26న బయల్దేరాల్సిన హౌరా - వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, ఎర్నాకుళం - హజ్రత్ నిజాముద్దీన్, పోర్‌బందర్ - కొచ్చువేళి, కేఎస్ఆర్ బెంగళూరు - అజ్మీర్ రైళ్లను దారి మళ్లించారు.
 
అలాగే, రద్దయిన రైళ్లలో ఆదిలాబాద్ - సీఎస్‌టీ ముంబై (24-27), సీఎస్‌టీ ముంబై - ఆదిలాబాద్ (25-28), హైదరాబాద్ - సీఎస్‌టీ ముంబై (24-27), సీఎస్‌టీ ముంబై - హైదరాబాద్ (25-28), సికింద్రాబాద్ - ఎల్‌టీటీ ముంబై (27న), ఎల్‌టీటీ ముంబై - సికింద్రాబాద్ (28న) రైళ్లు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు