జయలలితకు కూతురున్న మాట నిజమే: బాంబు పేల్చిన లలిత

బుధవారం, 29 నవంబరు 2017 (10:54 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కుమార్తె వున్న మాట నిజమేనని జయలలిత తండ్రి అయిన జయరామ్ సోదరి కుమార్తె లలిత బాంబు పేల్చారు. అయితే జయలలిత కుమార్తె అమృత అలియాస్ మంజులనా? కాదా? అనే విషయం మాత్రం తనకు కచ్చితంగా తెలియదని లలిత తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత తండ్రి జయరామ్ సోదరి కుమార్తె అయిన లలిత మాట్లాడుతూ.. తాము బెంగళూరులోనే నివాసం ఉంటున్నానని తెలిపారు.  
 
1970 నుంచి బెంగళూరులో ఉన్న తమకి చెన్నైలో ఉన్న జయలలిత కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు తగ్గిపోయాయని లలిత చెప్పారు. జయలలిత తల్లిదండ్రులు జయరామ్, సంధ్య మృతి చెందాక జయతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని లలిత గుర్తు చేశారు. 1980లో జయలలిత గర్భవతి అయ్యిందని తెలుసుకున్న పెద్దమ్మ.. తల్లిలేని పిల్ల అనే మానవత్వంతో తమిళనాడు వెళ్లి జయలలితకు అండగా నిలిచారని.. ఆపై రహస్యంగా కాన్పు చేయించారని తెలిపారు. జయలలితకు కుమార్తె పుట్టిందని పెద్దమ్మ స్వయంగా తమకు చెప్పారని వివరించారు. 
 
అనంతరం బెంగళూరులో జయలలిత సోదరి శైలజ ఓ అమ్మాయిని పెంచుకుంటున్నారని తమకు తెలిసిందని.. జయలలిత సోదరి శైలజ దగ్గర పెరిగిన అమ్మాయి ఈ అమృత అని లలిత గుర్తు చేశారు. అయితే జయలలితకు పుట్టిన బిడ్డ అమృత అని తాను కచ్చితంగా చెప్పలేనని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని లలిత వివరించారు. మూడు నెలల క్రితం తనను అమృత కలిసిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే జయకు కచ్చితంగా అమ్మాయి పుట్టిందని లలిత తేల్చి చెప్పడంతో అమ్మ అభిమానులు అయోమయంలో పడిపోయారు. 
 
అయితే ఈ వార్తలను జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొట్టిపారేశారు. ఇప్పటికే తాను దివంగత సీఎం జయలలిత కుమార్తెనని అమృత సారథి అనే యువతి సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెంగళూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. కాగా, దీనిపై జయలలిత మేన కోడలు దీపా జయకుమార్‌ మాట్లాడుతూ, అమృత సారథి ఎవరో తనకు తెలియదన్నారు. అమృత అసత్యాలు పలుకుతుందని తెలిపారు. అవివాహిత అయిన అత్తకు ఇలాంటి వాటితో సంబంధం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు