షాకింగ్.. జయలలితను మేము చూడనేలేదు: ప్రభుత్వ వైద్యులు

శనివారం, 9 డిశెంబరు 2017 (09:44 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. గతేడాది సెప్టెంబరు 22న జయలలిత స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల తర్వాత డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంపై మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జయలలితకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం తరపున నియమితులైన వైద్య బృందం షాకింగ్ నిజాలను తెలిపింది. 
 
జయలలితను అపోలో తాము చూడనేలేదని.. విచారణ కమిషన్ ఎదుట తెలిపారు. 75 రోజుల పాటు ఓ ప్రత్యేక గదికే తాము పరిమితం అయ్యామని.. ఉదయం గదిలోకి వెళ్లడం, సాయంత్రం వరకు అక్కడే కాలక్షేపం చేసి తిరిగి రావడం చేస్తుండే వారిమని విచారణ కమిషన్ ముందు వెల్లడించారు. ఇంకా ఆస్పత్రిలో వున్న జయలలితను తాము చూడనేలేదని వైద్య బృందం స్పష్టం చేశారు. 
 
జయ మృతిలో ఏదో మిస్టరీ వుందనే అనుమానంతో ప్రతిపక్షాలు, ప్రజలు న్యాయవిచారణకు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్యంలో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 27 మంది కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12, 13, 14, 20, 21 తేదీల్లో ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్, దీప, దీపక్, ప్రభుత్వ మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులు ఈ విచారణకు హాజరవుతారని  తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు