ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితో ఉన్నంత కాలం పోయస్ గార్డెన్ వైపు తొంగి చూసేందుకు సైతం సాహసం చేయని చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ ఇపుడు.. ఏకంగా అమ్మ నివాసమైన వేద నిలయంలో తిష్టవేశాడట. అంతేనా.. మంత్రులను అక్కడకు పిలించి లాగులు తడిసిపోయేలా ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నాడట. దీంతో ఏం చేయాలో అన్నాడీఎంకే మంత్రులకు దిక్కుతోచడం లేదట.
నిజానికి జయలలితతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి వెన్నంటి వున్న వ్యక్తి శశికళ. కొన్ని విభేదాల వల్ల శశికళను ఇంట్లోంచి పంపించినా జయలలిత మళ్లీ ఆమెను దగ్గరకు చేరదీశారు. శశికళ లేనిదే తాను ఉండలేనని బహిరంగంగా ప్రకటించారు కూడా. అయితే జయలలిత బతికున్న రోజుల్లో తన పోయెస్ గార్డెన్ బంగ్లాలోకి శశికళ భర్త నటరాజన్ను అనుమతించలేదు.
దీంతో పోయస్ గార్డెన్తో పాటు శశికళకు కూడా నటరాజన్ ఐదేళ్లుగా ఆయన దూరంగా ఉన్నారు. జయలలిత మరణించిన తర్వాత నటరాజన్ ఆ ఇంట్లో మళ్లీ అడుగుపెట్టారు. జయలలిత అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే మంత్రులందరినీ పోయస్ గార్డెన్కు పిలిపించి వారితో శశికళ, నటరాజన్లు ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలోనే నటరాజన్ అడిగిన ప్రశ్నలకు మంత్రులు హడలిపోయినట్టు పోయస్ గార్డెన్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే భవిష్యత్లో అన్నా డీఎంకే రాజకీయాల్లో శశికళతో పాటు ఆయన భర్త రాజ్యాంగేతరశక్తిగా ఆవిర్భవించనున్నారు.
ఇప్పటికే పోయెస్ గార్డెన్లో ప్రస్తుతం శశికళ దంపతులతో పాటు వారి సమీప బంధువులు నిండిపోయారు. సోమవారం రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత మరణించిన తర్వాత శశికళ బంధువులు అక్కడికి చేరుకున్నారు. జయలలిత భౌతికకాయం చుట్టూ వాళ్లే కనిపించారని, జయ బంధువులను దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు వచ్చాయి. ఇక జయలలిత అంతిమ సంస్కారాలను శశికళ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టగా, పార్టీ పగ్గాలు శశికళ చేతిలోనే ఉన్నాయి. శశికళను తన వారసురాలిని చేయాలన్నది జయలలిత చివరి కోరికని, అయితే ఆమె కోరిక నేరవేరలేదని నటరాజన్ పార్టీ నాయకులతో చెబుతూ భార్యను అందలమెక్కించేందుకు పథకం పన్నారని అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.