తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రిలోని అత్యవసర సేవల చికిత్సా విభాగంలో చేర్చి.. వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అపోలో ఆస్పత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
వాస్తవానికి జయలలిత గత సెప్టెంబరు నెల 22వ తేదీ నుంచి ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పూర్తిగా కోలుకున్నారనీ, ఆమె ఏ క్షణమైనా డిశ్చార్జ్ కావొచ్చంటూ అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పదేపదే చెపుతూ వచ్చారు.
ఇదిలావుండగా, జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్చారన్న వార్త వెలువడటంతోనే చెన్నై నగరంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. అలాగే, రాష్ట్రంలో వ్యాప్తంగా ముందస్తుగా పోలీసు బలగాలను మొహరిస్తున్నారు.
మరోవైపు జయలలిత అనారోగ్య వార్త తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ముంబై నుంచి అత్యవసరంగా చెన్నైకు బయలుదేరారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా గవర్నర్కు ఫోన్ చేసి జయలలిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.