దీప తప్పు కదూ.. అన్నతో అలా... మోడీ వద్దకు పంచాయతీ

సోమవారం, 12 జూన్ 2017 (14:42 IST)
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రజినీకాంత్ పార్టీ పెడతారని ఒకవైపు, దినకరన్ అన్నాడిఎంకేను తన ఆధీనంలో తీసుకుంటారని మరో వైపు, దీప జయలలిత ఆస్తుల కోసం పడుతున్న ఆరాటం, పళణిస్వామి-పన్నీరుసెల్వంల డ్రామా.. ఇలా చెప్పుకుంటే పోతే తమిళనాట రాజకీయాల గురించి ఒక్కరోజు పట్టదు. ఇదంతా జయలలిత మరణం తరువాతనే. జయలలిత బతికి ఉన్న సమయంలో అస్సలు తమిళ రాజకీయాలు కరుణానిధి - జయలలిత మధ్యే ఉండేది. అయితే ఆ తరువాత ఎవరు ఎప్పుడు మాట్లాడుతారో.. ఎలాంటి సంచలనం జరుగుతుందో ఆశక్తిగా మారింది. 
 
తమిళనాడు ప్రజలే కాదు.. యావత్ దేశం మొత్తం తమిళరాజకీయాలను ఆశక్తిగా గమనిస్తోంది. రాజకీయాల్లో ఆస్తుల వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్. జయలలిత ఆస్తులు మొత్తం వారసురాలిగా తనకే చెల్లాలంటూ దీప పంచాయతీ పెట్టారు. ఇప్పటివరకు జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న అన్న జయకుమార్ కుమారుడు దీపక్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కూడా జయలలిత గురించి గానీ లేక తన కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడలేదు. చెల్లెలు దీపతో కలిసే ఉండేవాడు దీపక్. అయితే గత కొన్నిరోజులుగా దీపక్ శశికళతో కలిసిపోయినట్లు తెలుస్తోంది. శశికళతో కలిస్తే ఆస్తులు తనకు వస్తాయన్నది దీపక్ ఆలోచనట. అందుకే ఇలాంటి దురుద్ధేశ పనిచేసినట్లు దీప ఆరోపిస్తోంది. 
 
ఆస్తుల వివరాల గురించి పోయెస్ గార్డెన్‌కు దీపక్ పిలవడంతో నిన్న దీప బయలుదేరి వెళ్ళింది. తన మద్దతుదారులతో అక్కడికి వెళ్ళిన వెంటనే శశికళ వర్గీయులు ఉన్నారు. ఒక్కసారిగా దీప, ఆమె మద్దతుదారులపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలీసులు చివరకు కలుగజేసుకుని ఇద్దరిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇదంతా జరిగిన తరువాత దీప తన అన్న దీపక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జయలలితను చంపేందుకు దీపక్ ప్రయత్నించారని ఆరోపించారు. దీపక్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆస్తి కోసం అతను శశికళతో కలిసిపోయాడని ఆరోపించారు. దీంతో అన్న, చెల్లెల్ల మధ్య గొడవ కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఆస్తి కోసం సొంత అన్నతోనే దీప గొడవకు దిగడం, అతన్ని అరెస్టు చేయాలని చెప్పడం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేపు ప్రధానమంత్రి ముందు పంచాయతీకి సిద్దమైంది దీప. ఆస్తులపై న్యాయపరంగా తేల్చుకోనుంది దీప.

వెబ్దునియా పై చదవండి