ఊచలు లెక్కెట్టాల్సి వస్తుందని బెదిరించడంతో కుమారుడిని పట్టించిన బీహార్ జేడీయు ఎమ్మెల్సీ

మంగళవారం, 10 మే 2016 (15:42 IST)
పోలీసుల ఒత్తిడి, బెదిరింపులకు బీహార్ అధికార జేడీయు ఎమ్మెల్సీ మనోరమాదేవి బెంబేలెత్తిపోయారు. నేరస్థుడి ఆచూకీ దాచడం కూడా నేరమే అవుతుందని చెప్పడంతో ఆమె హడలిపోయారు. ఒకవైపు కన్నబిడ్డ ఆచూకీ చెపితే పోలీసులు అరెస్టు చేస్తారు.. చెప్పకుంటే తనను స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఏం చేయాలో దిక్కుతోచక చివరకు కన్నబిడ్డ ఉన్న ఆచూకీని వెల్లడించడమే కాకుండా, స్వయంగా కుమారుడు దాగివున్న ప్రాంతానికి తీసుకెళ్లి పోలీసులకు పట్టించింది.
 
కేవలం కారును ఓవర్‌టేక్ చేశాడన్న అక్కసుతో 19 యేళ్ల ఇంటర్ చదివే సచ్‌దేవ్‌ అనే యువకుడిని బీహార్‌ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ ఘటన తర్వాత అతను పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. అయితే, నిందితుడిని తక్షణం అరెస్టు చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో గయ పోలీసు కమిషనర్ అవకాష్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం రంగంలోకి దిగింది. 
 
ఈ బృందం తొలుత ఎమ్మెల్సీ మనోరమాదేవి నివాసంలో సోమవారం రాత్రి సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో విదేశీ మద్యం బాటిళ్లు సహా అనేక అశ్లీల పుస్తకాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. అదేసమయంలో రాకీ ఆ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం తమకు స్వేచ్ఛ ఇచ్చిందని, రాకీని పట్టుకోకుండా ఉత్త చేతులతో వెళ్లేది లేదని రమాదేవికి స్పష్టంచేశారు.
 
అంతేకాకుండా, నేరస్థుడి ఆచూకీ దాచడం కూడా నేరమే అవుతుందని చెప్పడంతో ఇక అతడి గురించి చెప్పక తప్పలేదు. ఆమె భర్త కూడా ఇప్పటికే వేరే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. అత్యాచార ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌వల్లభ్ యాదవ్‌కు మనోరమ స్వయానా మరదలు కావడం గమనార్హం. ఆ విషయాన్ని కూడా పోలీసులు చెప్పి, ఎంతటి వాళ్లయినా ఊచలు లెక్కపెట్టక తప్పదని బెదిరించారు. 
 
దీంతో ఆమె దిగిరాక తప్పలేదు. చివరకు తన లాయర్లను కూడా సంప్రదించి రాకీ దాగివున్న మస్తీపురాకు పోలీసులను తీసుకెళ్లి పట్టించారు. ఫలితంగా మంగళవారం తెల్లవారుజామున రాకీని పోలీసులు పట్టుకున్నారు. ఆసమయంలో ఆ నిందితుడు తన తండ్రి బిందీ యాదవ్ డెయిరీ ఫారంలో దాగివున్నాడు. 

వెబ్దునియా పై చదవండి