ప్రముఖ పాత్రికేయుడు, టైమ్స్నౌ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి పాక్ ఉగ్రమూక నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను సమకూర్చింది. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్పై నిర్వహించిన టీవీ కార్యక్రమంలో గోస్వామి పాకిస్థాన్పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దీంతో అతడికి పాకిస్థాన్కు చెందిన ఉగ్ర మూకల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అతడి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నుంచి ప్రభుత్వానికి హెచ్చరికలు అందాయి. దీంతో అర్నాబ్కు భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘వై’ కేటగిరీ భద్రత కింద గోస్వామికి రోజులో 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది. 20 మంది గార్డులు ప్రతి క్షణం అతడి వెంట ఉంటారు. అలాగే ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా అతడికి రక్షణ కల్పిస్తుంటారు. ‘వై’ కేటగిరీ కింద ప్రభుత్వం రెండు రకాల భద్రతను కల్పిస్తుంది. మొదటి దాంట్లో మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తదితరులకు భద్రత కల్పిస్తుండగా రెండో విభాగంలో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు చెప్పిన వ్యక్తులకు ఈ రకం భద్రత కల్పిస్తారు.
'టైమ్స్ నౌ' చానల్లో ప్రైమ్ టైమ్ న్యూస్ డిబేట్ ద్వారా పాపులరయిన ఆర్నబ్ ఉరీ దాడుల తర్వాత తీవ్రవాద సంస్థలు, పాకిస్థాన్కు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. ఆర్నబ్తో పాటు జీ న్యూస్కు చెందిన సుధీర్ చౌధరీ(ఎక్స్ కేటగిరి), సమాచార్ ప్లస్కు చెందిన ఉమేశ్ కుమార్(వై కేటగిరి), అశ్విని కుమార్ చోప్రా(జడ్ ప్లస్ కేటగిరి)లకు కేంద్రం భద్రత కల్పించింది.