రజనీకాంత్‌కు నో ఛాన్స్... కమల్ హాసనే తమిళనాడు సీఎం.. గురూజీ జోస్యం

మంగళవారం, 1 ఆగస్టు 2017 (12:22 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురైన నేపథ్యంలో... రాజకీయాల్లోకి సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో బలమైన నాయకత్వం లేకపోవడంతో రజనీకాంత్, కమల్ హాసన్‌లు రాజకీయాల్లో రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
రజనీకాంత్ ఇంకా అధికారికంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించకపోయినా.. కమల్ హాసన్ మాత్రం రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రులను ఏకిపారేస్తున్నారు. దీంతో కమల్ హాసన్, రజనీకాంత్.. వీరిద్దరిలో ఎవరు రాజకీయాల్లోకి వస్తారనే అనుమానం ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీ, కమల్ ఎవరికి సీఎం పదవి దక్కుతుందనే దానిపై జ్యోతిష్యులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సేలంలో జరిగిన ఓ జ్యోతిష్య సదస్సులో పాల్గొన్న ఆదిత్య గురూజీ.. తమిళ రాజకీయాలపై మాట్లాడుతూ.. రజనీకాంత్ ప్రత్యేకంగా పార్టీ ప్రారంభించినా ఆయనకు సీఎం కాలేరని చెప్పారు. ప్రజలు ఆశించే వ్యక్తి సీఎం కావొచ్చునని.. అది కమల్ హాసన్ అయి వుండొచ్చునని చెప్పారు.  
 
ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌కు సినీ ప్రముఖుల మద్దతు పెరిగిపోతోంది. తాజాగా.. సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ కమల్‌కు మద్దతు ప్రకటించింది. బిగ్‌ బాస్‌ రియాలిటీ షోతో రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్న కమల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చురుగ్గా వున్నారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ... ఖుష్బూ స్పందిస్తూ, కమలహాసన్‌ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కమల్‌ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తానని తెలిపారు. కమల్‌‌కు తన మద్దతు, అభిమానం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి