కావేరి నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గత శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ జరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జరుపుతున్న నీటివిడుదలను కొనసాగిస్తే రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ప్రజలకు తాగునీరు కూడా లభించని పరిస్థితి ఎదురవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా సిద్ధరామయ్య లేఖ రాశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే ఈ జలవివాదంలో అందరి ముఖ్య మంత్రుల లాగానే తాను ప్రవర్తించానని... అయితే తనని మాత్రం ఎందుకు విలన్గా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కావేరీ వివాదం ప్రారంభమైనప్పటినుండి తననే టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. గతంలో దేవగౌడ, జగదీశ్ శెట్టర్ల పాలనలోనూ కావేరీ నీటిని సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా విడుదల చేశారన్నారు. ఈ విషయంపై ప్రధాన మంత్రితో చర్చించేందుకు పలు లేఖలు రాశామని... కనీసం తమ వాదన వినేందుకు కూడా ప్రధాని అనుమతి ఇవ్వడం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేధాలను పెద్ద మనిషి తరహాలో ప్రధాని పరిష్కరించాల్సి ఉందన్నారు.