డిగ్రీ చేసి నిరుద్యోగిగా ఉన్నారా.. అయితే, రూ.3 వేలు నిరుద్యోగ భృతి.. ఎక్కడ?

మంగళవారం, 21 మార్చి 2023 (14:01 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అపుడే రాజకీయ పార్టీలో ప్రచార గోదాలోకి దిగాయి. అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా వివిధ రకాలైన హామీలను గుప్పిస్తున్నాయి. ఇందులోభాగంగా, వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే డిగ్రీ చేసి నిరుద్యోగులుగా ఉండే యువతకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
 
"యువ క్రాంతి" సమావేశ పేరుతో ఆ పార్టీ సోమవారం బెల్గాంలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా రాహుల్ ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
 
"యువనిధి" పేరుతో కర్నాటక నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.3 వేలు అందజేస్తామని భరోసా కల్పించారు. డిగ్రీ చేసి ఉద్యోగం లేని వారికి నెలకు రూ.3 వేలు, డిప్లొమా విద్యార్హత కలిగిన వారికి రూ.1500 చొప్పున అందిస్తామని రాహుల్ వెల్లడించారు ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా 24 నెలల పాటు ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. 
 
 
 
అలాగే, "గృహజ్యోతి" పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. అలాగే, "గృహలక్ష్మి" పేరుతో ప్రతి గృహానికి నెల నెలా రూ.2 వేలు అందిస్తామని హమీ ఇచ్చారు. "అన్నభాగ్య" కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పది కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు