ఆర్టికల్ 370, 35-ఏ రద్దుతో అంతా మంచే జరుగుతుంది: అమిత్ షా

సోమవారం, 5 ఆగస్టు 2019 (18:50 IST)
ఆర్టికల్ 370, 35-ఏ రద్దుతో జమ్మూకాశ్మీర్‌కు మహర్దశేనని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సభ్యుడు అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా వివరణ ఇస్తూ.. ప్రజల బాగోగుల కోసమే పార్లమెంట్ చట్టాలు చేస్తోందన్నారు. 
 
ఆ చట్టాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడం లేదని,  ఆర్టికల్ 370 రద్దుతోనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. ఈ ప్రాంత యువతులు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారి ఆస్తి హక్కు కోల్పోతున్నారని, అక్కడి మహిళలకు సాధికారత రావాలంటే ఈ ఆర్టికల్  రద్దు కావాలని చెప్పారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు. ఈ బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని, ఈ బిల్లు పూర్తిగా న్యాయ సమీక్షకు నిలబడుతుందని స్పష్టం చేశారు. 
 
దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన ఆర్టికల్ 370 పరిసమాప్తమైందని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సభ్యుడు అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కాశ్మీర్‌లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు