ఆన్‌లైన్ రమ్మీ గేమ్ : కోహ్లీ - తమన్నాలకు కోర్టు నోటీసులు

బుధవారం, 27 జనవరి 2021 (14:38 IST)
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ (రమ్మీ) వివాదంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ నటి తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు జారీచేసింది. వీరిద్దరితో పాటు మాలీవుడ్‌ నటుడు అజు వర్గీస్‌కు కేరళ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ ‌రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. 
 
త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టు కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇ‍వ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఈ వివాదంలో పలువురు నటులుతోపాటు, క్రికెట్‌ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ,  హీరోయిన్‌ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గత ఏడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 
 
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత‍్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ముగ్గురు సెలెబ్రిటీలకు నోటీసులు జారీచేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు