పెళ్లైన రెండు నెలలకే భార్యకు కరెంట్ షాకిచ్చి.. కారణం ఏంటో తెలుసా?

సోమవారం, 28 డిశెంబరు 2020 (12:29 IST)
పెళ్లైన రెండు నెలలకే భార్యకు కరెంట్ షాకిచ్చి హత్య చేశాడు.. ఓ యువకుడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కరక్కోణం ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే అరుణ్ కుమార్(28), తన తల్లి స్నేహితురాలైన శాఖా కుమారితో(51) ప్రేమాయణం నడిపాడు.

కొన్నాళ్లు తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అక్టోబర్ 19న కొద్దిమంది సమక్షంలో ఆమె మెడలో తాళికట్టాడు. ఇద్దరి మధ్య దాదాపు 23 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్న మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నాడని మీకు అనుమానం రావచ్చు.
 
శాఖా కుమారి మంచి స్ధితిపరురాలు. ఆర్ధికంగా బాగా ఎదిగిన కుటుంబం. ఒంటరి మహిళ. తోడు కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు జీవితంలో ఒక తోడు కావాలి. దాని కారణంగా ఆమె అరుణ్ కుమార్‌ను ఇష్టపడింది. ఆమె అవసరాన్ని అరుణ్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.
 
శాఖా కుమారిని చేసుకుంటే ఆమె ఆస్తి మొత్తం కొట్టేయ్య వచ్చనే ఆలోచనతో అరుణ్ ఆమె మెడలో తాళి కట్టాడు. కానీ…. తమ పెళ్లి విషయం సమాజంలో గుట్టుగా ఉంచాలని భావించాడు. అరుణ్‌ను పెళ్లి చేసుకున్నతర్వాత శాఖా కుమారి చాలా సంతోషంగా ఉంది.

అరుణ్ ఉద్యోగానికి ఆస్పత్రికి వెళ్ళగానే కుమారి తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకన్న విషయం నలుగురితో చెప్పి సంతోషాన్ని పంచుకునేది. వారికి తమ పెళ్లి ఫోటోలు పంపించటం మొదలెట్టింది.
 
ఈ విషయం అరుణ్ కుమార్‌కు తెలిసింది. పెళ్లి ఫోటోలు ఇతరులకు పంపించవద్దని భార్యతో చెప్పాడు. అయినా ఆమె తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోటానికి ఫోటోలు షేర్ చేసేది. దీంతో అరుణ్‌కు కోపం వచ్చింది. తన పెళ్లి బయట సమాజానికి తెలియటం అతనికి ఇష్టం లేదు. డిసెంబర్ 26, శనివారం నాడు ఈవిషయమై ఇద్దరి మధ్య గొడవ జరగింది. కోపం పట్టలేని అరుణ్ ఆమెకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు.
 
తన భార్యకు షాక్ కొట్టి పడిపోయిందని చికిత్స చేయాలని వైద్యులను కోరాడు. అప్పటికే ఆమె మరణించటంతో డాక్టర్లు ఎలా చనిపోయిందని అడిగారు. అరుణ్ కుమార్ చెప్పే మాటలపై నమ్మకం కుదరని వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కుమార్‌ను ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. ఈ విచారణలో కరెంట్ షాకిచ్చి భార్యను హతమార్చిన విషయం బట్టబయలు అయ్యింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు