సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ సర్కారు.. ఏంటది?

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (14:17 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసమే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన అవకాశాలతో పాటు సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని ప్రధాని మోడీ సైతం వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలను ఇంటివద్దే పొందే అవకాశం లభిస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు లడఖ్‌ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివుందని ఈ సందర్భంగా తెలిపారు. అయితే, లడఖ్ వాసులు తమకు రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం కొత్తగా మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
కాగా, ఈ కొత్త జిల్లాల పేర్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం వెల్లడించారు. జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్ థాంగ్ అనే పేర్లతో  ఈ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఐదు జిల్లాలతో కలిసి లడఖ్ ప్రాంతంలో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరింది. అభివృద్ధి వైపు లడఖ్ చేస్తున్న ప్రయాణంలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం మరో ముందడుగు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, లడఖ్ వాసులకు ఆయన అభినందనలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు