లోక్‌సభ ఎన్నికలు : మ్యాజిక్‌కు ఫిగర్‌కు 272 .. బీజేపీ 240 సీట్లు

వరుణ్

బుధవారం, 5 జూన్ 2024 (11:38 IST)
దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లకుగాను 542 సీట్ల ఫలితాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం ఫలితం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి బీజేపీ పంకజా ముండేపై ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి బజ్ రంగ్ మనోహర్ సోన్వానే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ సూరత్ నియోజకవర్గ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ అవసరం రాలేదు. 
 
ఈ ఎన్నికల్లో మొత్తంమీద కేంద్రంలోని అధికార బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతోపాటు ఇతర మిత్రపక్ష పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తంగా ఎన్డీయే కూటమి 293 సీట్లలో బలం పొందింది. దీంతో ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లు గెలుచుకుంది.
 
మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో సాధించిన 52 సీట్ల సంఖ్యను దాదాపుగా రెట్టింపు చేసుకుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో 37 సీట్లలో విజయఢంకా మోగించింది. ఇక ఈ కూటమిలోని మరో పార్టీ అయిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సైతం 29 సీట్లలో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో సాధించిన 22 ఎంపీ సీట్ల లెక్కను మెరుగుపరుచుకుంది. రాజస్థాన్, హర్యానాలలో బీజేపీ సీట్లకు కాంగ్రెస్ గండికొట్టగా యూపీలో బీజేపీ సీట్లకు సమాజ్ వాదీ పార్టీ ఎసరుపెట్టింది. మొత్తంగా ఇండియా కూటమి 235 సీట్లు సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు