బలపరీక్షకు మేం రెఢీ : మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్

మంగళవారం, 21 మే 2019 (11:39 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్షం ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు లేఖ రాసింది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 230 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లు రాగా, బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. బీఎస్పీకి 2, ఎస్పీకి ఒక సీటు, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సివుండగా, బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్ చేస్తోంది. ఈ సమావేశాల్లో అవిశ్వాస పరీక్షను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 
 
దీనిపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించారు. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ చేసిన డిమాండ్‌పై స్పందించిన కమల్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నో ప్రాబ్లెం" అని పేర్కొన్న ఆయన విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
బీజేపీ నేతల ఆరోపణలపై కమల్‌నాథ్ స్పందించారు. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచీ బీజేపీ ఇవే ఆరోపణలు చేస్తోందన్నారు. గత ఐదు నెలల్లో నాలుగుసార్లు తాను మెజార్టీని నిరూపించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చని కమల్‌నాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు