మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను రూ.50,000 అప్పు తీర్చడానికి అమ్మేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంకా భార్యపై స్నేహితుడిచే అత్యాచారం చేయించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
శిక్షార్హమైన నేరానికి సంబంధించి ఫిర్యాదు అందినప్పుడు, అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా 'జీరో' ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అలా నమోదైన కేసుకు సంబంధించి బాధితురాలి భర్త జూదగాడు అని, ఆ అలవాటు కారణంగా అతని అప్పు పెరుగుతూనే వచ్చిందని కన్వాన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభయ్ నీమా తెలిపారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన తన భర్త.. తనకు డబ్బు అప్పుగా ఇచ్చిన తన స్నేహితుల్లో ఒకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించిందని ఆయన అన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు పురుషుల కోసం గాలింపు ప్రారంభించామని ఆయన చెప్పారు. భర్త అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో భార్యను రూ.50వేలకు అమ్మేశాడని పోలీసులు అంటున్నారు.