మోడీ స్థానికుడు.. నేను పరాయిదాన్నా? మమతా బెనర్జీ "స్థానిక" అస్త్రం

మంగళవారం, 9 మార్చి 2021 (19:55 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. బెంగాల్‌లో పాగా వేయాలని కమలనాథులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కలిసి బెంగాల్‌లో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. అలాగే, టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కటే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. 
 
పైగా, బీజేపీని ఎదుర్కొనేందుకు ఆమె ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి తన ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌కు మమతా బెనర్జీ ఓ పరాయి వ్యక్తి అని అన్నారు. 
 
తాను ఈ గడ్డపై పుట్టినవాడ్నని, ముఖ్యమంత్రి ఓ బయటి వ్యక్తి అని విమర్శించారు. దీనిపై మమత ధీటుగా స్పందించారు. తాను పరాయి వ్యక్తిని అయితే, గుజరాత్ నుంచి వచ్చినవారు స్థానికులా? అంటూ పరోక్షంగా మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
"నందిగ్రామ్‌లో నన్ను కొందరు బయటి వ్యక్తి అని పిలుస్తుండటం విస్మయం కలిగిస్తోంది. నేను పొరుగునే ఉన్న బిర్భూమ్ జిల్లాలోనే పుట్టి, పెరిగాను. కానీ నన్ను పరాయి వ్యక్తి అని పిలుస్తున్న వ్యక్తి కూడా ఇక్కడ పుట్టలేదు. అలాంటివాళ్లు కూడా నన్ను బయటి వ్యక్తిని చేసేస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చినవాళ్లు మాత్రం స్థానికులు అయిపోతున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
నేడు తన ప్రచారం ప్రారంభించిన మమత మాట్లాడుతూ, తాను నందిగ్రామ్‌ను ఎన్నటికీ మర్చిపోనని, కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. "మీరు వద్దంటే నేను నామినేషన్ దాఖలు చేయను. కానీ మీరు నన్ను మీ పుత్రికగా భావిస్తే నామినేషన్ వేస్తాను" అని నందిగ్రామ్ ప్రజల్లో స్థానిక సెంటిమెంట్‌ను రేకెత్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు