బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. బంగ్లాలో మేకేం పని : మమతా ప్రశ్న

ఆదివారం, 28 మార్చి 2021 (08:50 IST)
బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే బంగ్లాదేశ్‌లో మీకేం పని అంటూ ప్రధాని నరేంద్ర మోడీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. పోలింగ్ జరుగుతున్న వేళ బంగ్లాదేశ్‌లో బంగ్లా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగాలు చేయడం, హిందూ ఆలయాలను సందర్శించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అందువల్ల తక్షణం మోడీ వీసాను రద్దు చేయాలని మమతా డిమాండ్ చేశారు. 
 
ప్రధాని మోడీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు ఢాకాకు వెళ్ళారు. అదీకూడా బెంగాల్ తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయన బంగ్లాలో పర్యటిస్తూ, పలు హిందూ దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. అలాగే, బంగ్లా ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన ప్రసంగించారు. దీనిపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
 
"బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆయన బంగ్లాదేశ్ కు వెళ్లి, బెంగాల్‌పై ప్రసంగాలు చేస్తున్నారు.ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి వ్యతిరేకమైన చర్య" అని మమత ఖరగ్‌పూర్‌లో జరిగిన ఓ ప్రచార సభలో ఆరోపించారు.
 
"2019లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఓ బంగ్లాదేశ్ నటుడు మా ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చారు. ఆ వెంటనే బంగ్లాదేశ్‌తో మాట్లాడిన బీజేపీ నేతలు ఆయన వీసాను రద్దు చేయించారు. ఇప్పుడు బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుంటే, మీరు (ప్రధాని) బంగ్లాదేశ్‌కు వెళ్లి, ఓ వర్గం ప్రజల ఓట్లను ప్రజల ఓట్లను ప్రభావితం చేసేలా మాట్లాడారు. ఆయన వీసాను ఎందుకు రద్దు చేయరు?. ఈ విషయంలో మేము ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నాం" అని మమత వెల్లడించారు. 
 
బంగ్లాదేశ్ లోని ఓరాకాండీలో ఉన్న హిందూ దేవాలయంలో మోదీ పూజలు చేయడాన్ని ప్రస్తావించిన ఆమె, ఆయన అక్కడికి వెళ్లి కూడా ఎన్నికల ప్రచారం చేశారని, మతువా వర్గం ఓటర్లను ఆయన ప్రభావితం చేయాలని చూశారని మమత ఆరోపించారు. 
 
ప్రస్తుతం మతువా వర్గం ప్రజలు లక్షలాది మంది పశ్చిమ బెంగాల్‌లో నివాసం ఉంటూ, ఈ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇదేసమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడిన మోదీ, భవిష్యత్తులో ఒరాకాండీ నుంచి ఇండియాకు రాకపోకలను సులువు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు