దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగ యుగం నడుస్తుంది. దేశంలోని 145 మంది జనాభా ఉంటే వారిలో 45 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నట్టు టెలికాం సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అధునాత స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలు కూడా అధిక సంఖ్యలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్లు ఉత్తిపుణ్యానికే పేలిపోతున్నాయి. మొబైల్ చార్జింగ్ పెట్టిన సమయంలో, ప్యాకెట్లలో పెట్టుకున్నపుడు, గంటల కొద్దీ మాట్లాడుతున్నపుడు వేడెక్కి పేలిపోతూ ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి.
తాజాగా ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా, ఆమె ఫ్యాంటు వెనుక జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. భర్తతో కలిసి షాపింగ్ చేస్తుండగా జరిగిన ఈ పేలుడుతో ఆ మహిళ ఒక్కసారిగా గట్టిగా గీపెట్టింది. ఈ పేలుడును చూసిన ఇతర కొనుగోలుదారులు భయంతో వణికిపోయారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ పిరుదులతో పాటు చేతులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైయ్యాయి. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందన్నది తెలియలేదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.