రన్‌వేపై జారిపోయిన జెట్‌ఎయిర్‌వేస్...161 మంది ప్రయాణికులు సురక్షితం

మంగళవారం, 27 డిశెంబరు 2016 (09:55 IST)
గోవా విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జెట్ ఎయిర్‌వేస్‌‌కు చెందిన విమానమొకటి ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో విమానంలోని ఏడుగురు విమాన సిబ్బందితో పాటు.. మొత్తం 161 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రయాణికులను తరలించే సమయంలో పలువురు స్వల్పపాటి గాయాలకు గురయ్యారు. 
 
గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్‌ఎయిర్ 9డబ్ల్యూ 2374 విమానం డబ్లిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, రన్‌వే పై నుంచి పక్కకు జారిపోయింది. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోయేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ ఘటన కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. 

వెబ్దునియా పై చదవండి