అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబంపై మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత మీడియాకు దూరంగా ఉన్న నత్తం విశ్వనాథన్.. దివంగత సీఎం జయలలిత ఆస్పత్రిలో చేరాక అపోలోకు వచ్చారు. ఆమె మరణానికి తర్వాత కూడా మీడియా కంట్లో పడని నత్తం విశ్వనాథన్.. ఓపీఎస్ తిరుగుబావుటా ఎగురవేశాక.. ఆయనకు మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో తమిళ రాష్ట్రంలోని దిండుక్కల్లో జరిగిన ఓపీఎస్ వర్గం మద్దతుదారుల సమావేశంలో నత్తం విశ్వనాథన్ మాట్లాడుతూ.. జయలలిత ఏ కుటుంబంతోనూ సంబంధాలను కలిగివుండకూడదనుకున్న శశికళ ఫ్యామిలీ చేతుల్లోనే ప్రస్తుతం అన్నాడీఎంకే వుందన్నారు. ఇప్పటివరకు శశికళ గురించి 10 శాతం నిజాలే బయటికి చెప్పాం.. మిగిలిన నిజాలు చెప్తే.. ఆమె కుటుంబాన్ని తమిళ రాష్ట్రం నుంచే ప్రజలు తరిమికొడతారని నత్తం విశ్వనాథన్ హెచ్చరించారు.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళకు అమ్ముడుపోయారని.. ఆ ఎమ్మెల్యేలు పోలీసుల భద్రత లేనిదే సొంత నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని నత్తం గుర్తు చేశారు. శశికళ తనకు హెల్ఫర్ మాత్రమేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెప్పారని.. తన ఆస్తులన్నీ పార్టీకే సొంతమని అమ్మ చెప్పినట్లు నత్తం విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఇంకా పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదని అమ్మ భావించారో.. అదే జరిగిపోయిందని.. కానీ పార్టీని, పాలనను శశికళ చేతుల నుంచి పన్నీర్ సెల్వం కాపాడుతారని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.