లంచం ఇస్తే ఏడేళ్ల జైలు శిక్ష... జాగ్రత్త...

బుధవారం, 1 ఆగస్టు 2018 (11:09 IST)
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం-1988కి సవరణ చేసింది. ఇందుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. సవరించిన ఈ చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరమవుతుంది. అక్రమ మార్గాల్లో పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వటం, ప్రయోజనాల ఆశ చూపించటం, ఇస్తానని హామీ ఇవ్వటం కూడా నేరంగా పరిగణిస్తారు. ఇలా లంచం ఇచ్చిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఏడేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం వుంది.
 
లంచం ఇచ్చిన వారికే కాకుండా.. లంచం తీసుకున్న వారికీ శిక్షలుంటాయి. ప్రస్తుతం లంచం తీసుకున్న కేసుల్లో మూడేళ్ల వరకు శిక్ష ఉంటే.. కొత్త చట్ట సవరణ ప్రకారం వారికి కూడా ఏడేండ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఏ చట్టాల్లోనూ లంచం ఇవ్వజూపే వ్యక్తులకు శిక్షలు లేవు. ఇప్పుడు ఈ చట్టం తీసుకురావటం వల్ల వారు కూడా నేరం చేసినట్లు అవుతుంది.
 
అయితే కొత్త చట్టంలో ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలు, బ్యాంకర్లు, ఇతర సంస్థల అధికారులకు రక్షణ కల్పించారు. సంబంధిత సంస్థల ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నేతలు, బ్యాంకర్లను సీబీఐ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారించలేవు. కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు