కారుణ్య మరణాలకు ఓకేనా?.. ముసాయిదా బిల్లును తయారు చేసిన ఆరోగ్య శాఖ

మంగళవారం, 10 మే 2016 (18:53 IST)
దేశంలో కారుణ్య మరణాలకు కేంద్రం అనుమతించనుంది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ ముసాయిదా బిల్లును రూపొందించిన తర్వాత ప్రజాభిప్రాయం కోరతామని, వారినుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని సమగ్ర చట్టాన్ని తీసుకొస్తామని 'జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్' డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
నిజానికి దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలా, వద్దా అన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. కారుణ్య మరణాలను అనుమతించేందుకు 'ప్రొటెక్షన్ ఆఫ్ పేషంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్' చట్టంలో సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ చట్ట సవరణలో భారత వైద్య మండలి (ఎంసీఐ) కీలక పాత్ర పోషించాల్సి ఉంది. 
 
ఇదిలావుండగా, గతంలో అరుణ షాన్‌బాగ్ అనే నర్సు రేప్ కారణంగా 42 ఏళ్లపాటు ఆస్పత్రి పడకపై జీవచ్ఛవంలా గడిపింది. ఆమె పనిచేసిన అస్పత్రి నర్సులే ఆమెను అన్నేళ్ల పాటు చూసుకున్నారు. కామన్ కాజ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ 2005లో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు విచారించినప్పుడు మరోసారి కారుణ్య మరణాలపై చర్చకు తెరలేసింది. 
 
ఈ పిటిషన్ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు కోరింది. అప్పుడు కేంద్రం కారుణ్య మరణాలను అనుమతించేందుకు సమ్మతించలేదు. కారుణ్య మరణాలను అనుమతించాలంటూ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సులను సైతం నాటి కేంద్ర సర్కారు తిరస్కరించింది. ఇప్పుడు అదే లా కమిషన్ మళ్లీ చేసిన సిఫార్సును ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం గమనార్హం. 
 
అయితే, కారుణ్య మరణాలను రెండు విధాలుగా చేస్తారు. ఒకటి యాక్టివ్ ఎథనేషియా, రెండు పాసివ్ ఎథనేషియా. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. 
 
యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసేందుకు ఇంజెక్షన్ ద్వారా విషమిచ్చి మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. ఇందులో యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపిందని డాక్టర్ జగదీష్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి