శశికళ ముందస్తు విడుదల లేనట్టే : క్లారిటీ ఇచ్చిన జైళ్ళ శాఖ

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:09 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న ఆ పార్టీ మాజీ మహిళానేత శశికళ జైలు నుంచి ముందుగానే విడుదల కానుందనే వార్తలు మీడియాలో వచ్చాయి. దీనికితోడు ఆమె బంధువు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో శశికళ శిక్షాకాలం పూర్తికాకముందే సత్‌ప్రవర్తన కారణంగా ముందుగానే జైలు నుంచి విడుదల కావొచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. 
 
ఈ క్రమంలో కర్నాటక జైళ్ళ శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ముందస్తుగానే విడుదల కాబోరని స్పష్టం చేసింది. ఆమెకు పడిన శిక్ష పూర్తయిన తర్వాత, వచ్చే సంవత్సరం జనవరిలోనే విడుదల అవుతారని పేర్కొంది.
 
కాగా, 2017 ఫిబ్రవరి నుంచి ఆమె శిక్షను అనుభవిస్తుండగా, సత్ప్రవర్తన కారణంగా అక్టోబరులో విడుదల అవుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆమె విడుదలపై కర్ణాటక జైళ్ల శాఖకు లేఖ రాయగా, అటువంటిదేమీ జరుగబోదని వెల్లడించింది. 2021 జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, సమాచార హక్కు చట్టం కింద నరసింహమూర్తి అనే వ్యక్తి రాసిన లేఖకు జైళ్ల శాఖ బదులిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు