అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన వల్ల కలిగిన బాధ, అవమానాన్ని మాత్రం ఎన్నిటికీ మరిచిపోలేమన్నారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని అన్నారు.
భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని త్వరగా స్పందించినప్పటికీ, రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయని తెలిపారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని శశిథరూర్ అన్నారు. అయితే, భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ చాలా త్వరగా స్పందించారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం. రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది' అని థరూర్ అన్నారు.
భారత్ విషయంలో తప్పు చేశానని డోనాల్డ్ ట్రంప్కు అర్థమైంది కాబట్టే స్వరం మార్చారని ఇండియా మాజీ దౌత్యవేత్త కేపీ ఫాబియన్ అన్నారు. దూకుడుగా ముందుకెళ్లి తప్పుచేసినట్లు ట్రంప్ గ్రహించారని పేర్కొన్నారు. రష్యా చమురుకొంటే 25 శాతం అదనపు సుంకం విధించడం ట్రంప్నకు ఆశించిన ఫలితం ఇవ్వలేదన్నారు. 'ట్రంప్ వ్యాఖ్యలకు తగినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కానీ, దీనితోనే వివాదం ముగిసిపోయిందనే నిర్ధరణకు రాకూడదు. ఇండియా ఎప్పటికీ ఇండియాగానే ఉంటుంది. ఇండియా నాగరిక దేశం. భారత్ మరే ఇతర దేశాన్ని అనుసరించదు అని ఆయన వ్యాఖ్యానించారు.