సార్వత్రిక ఎన్నికల వేళ - విద్యార్థులకు యేటా రూ.10 వేల ఉపకారవేతనం

ఠాగూర్

బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:24 IST)
ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులను ఆకర్షించేలా ఒక ఉపకారవేతన పథకం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా, ప్రతి విద్యార్థికి రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం అందజేయనునంది. ఎస్సీ, ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే 10 వేల రూపాయలు, విద్యార్థినులైతే రూ.11 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చెల్లించినా, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైనా వారు ఈ ఉపకారవేతన పథకానికి మాత్రం అనర్హులు. 
 
"నూతన ఉన్నత అభిలాష - ఒడిశా" పేరిట ఈ పథకం అమలు కానుంది. 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.385 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం 30 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒడిశాలో 4.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, 32 వేల మంది పీజీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల విద్యార్థులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలోని సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి ఈ ఉపకారవేతన నగదును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో జమచేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు