మైనస్ ప్లస్ మైనస్ కలిపితే ప్లస్.. ఇదీ ఉత్తరాఖండ్ విద్యామంత్రి ఆన్సర్ (Video)

శనివారం, 16 సెప్టెంబరు 2017 (14:55 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా తన పరువు తానే తీసుకున్నారు. మైనస్ ప్లస్ మైనస్ కలిపితే ప్లస్ వస్తుంది.. ఆ మాత్రం తెలియదా? అంటూ గణితం బోధించే ఉపాధ్యాయురాలిని బెదిరించి పరువు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విద్యాశాఖమంత్రి అరవింద్‌ పాండే కొనసాగుతున్నారు. ఈయన శుక్రవారం ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లోని గణితం బోధిస్తున్న టీచర్‌కు పరీక్ష పెట్టారు.
 
తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి టీచరమ్మ మైనస్‌ అని సమాధానం చెప్పింది. ఈ సమాధానంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. మైనస్ ఎలా అవుతుంది.. సమాధానం ప్లస్‌ అంటూ మంత్రివర్యులు బదులిచ్చారు. 
 
ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత ప్రశ్నించారు. దాని సమాధానం మైనస్‌ రెండు కాగా, అందరి సమక్షంలో మంత్రి సున్నా అని సమాధానం చెప్పడమే కాకుండా తాను చెప్పినదే సరైందంటూ వాదించారు. ఆ తర్వాత గణితం పాఠ్యపుస్తకంలోని ఆరో శీర్షికలో ఉన్న పాఠ్యాంశాలేంటి? అని టీచరమ్మను ప్రశ్నించాడు. 
 
ఇంతలో మంత్రిగారి లెక్కల పరిజ్ఞానానికి సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఈ విషయాన్ని ఆయన అనుచరులు మంత్రిగారి చెవినపడేశారు. అంతే ఇక అక్కడ నుంచి మంత్రిగారు చెప్పాపెట్టకుండా జారుకున్నారు. 
 
అయితే, స్కూల్ టీచర్‌ పట్ల మంత్రిగారు ప్రవర్తించిన తీరుపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. మంత్రి చేసిన తప్పుకు తక్షణం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. 
 
అలాగే విద్యారంగ నిపుణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యామంత్రి అయ్యేందుకు చదువుకోవాల్సిన పనిలేదనీ.. వేలి ముద్ర వేసే వ్యక్తి కూడా విద్యామంత్రి కావొచ్చని, కానీ గణిత పాఠాలు బొధించాలంటే ఖచ్చితంగా చదువుకుని ఉండాలంటూ సెటైర్లు వేస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి