ఒకే వేదికపై నేతాజీ - బెహన్‌జీ.. 26 యేళ్ల తర్వాత చేతులు కలిపిన బద్ధశత్రువులు

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (14:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. అధికార భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఆ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా బద్ధశత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే, ఆ రెండు పార్టీల అధినేత్రి, అధినేత కూడా ఒకే వేదికపై 26 యేళ్ళ తర్వాత కనిపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ నేత ములాయం సింగ్‌ మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఇరు పార్టీలు కలిసి మహా ర్యాలీని నిర్వహిచాయి. ఇందులో ములాయం, మాయావతితో పాటు ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. 
 
నిజానికి గత 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరాం, ములాయం సింగ్‌ కలిసి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. నాటి ఎన్నికల్లో ఎస్పీకి 109, బీఎస్పీకి 67 స్థానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 177 స్థానాలు సాధించినప్పటికీ.. ఎస్పీ - బీఎస్పీలు, చిన్నాచితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 
 
అయితే వీరి సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. 1995లో మాయావతి బీజేపీతో చర్చలు జరుపుతోందన్న సమాచారం అందడంతో ఎస్పీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఓ అతిథి గృహంలో బీఎస్పీ సమావేశం జరుగుతుందని తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు అక్కడికెళ్లి బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. 
 
ఈ దాడి నుంచి మాయావతి తప్పించుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇరు పార్టీలు విడిపోయాయి. నాటి నుంచి నేటి వరకు ములాయం, మాయావతి మద్య మాటలు కూడా లేవు. కానీ, 17వ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పుణ్యమాని ఈ రెండు పార్టీలు ఏకంకాగా, ములాయం సింగ్, మాయావతిలు ఒకే వేదికను పంచుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు