సమాజంలో వరకట్నం వేధింపులు ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ యువకుడు తన గొప్ప మనసు చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన లక్షల రూపాయల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించారు. వధువే తమకు అసలైన కానుక అని చాటి చెప్పారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్పూర్ జిల్లాలోని భాబ్సి రాయ్పూర్ గ్రామానికి చెందిన వికాస్ రాణా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన తండ్రి శ్రీపాల్ రాణా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున యూపీలోని కైరానా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. సంస్కరణ భావాలు కలిగిన వికాస్కు, హర్యానాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్తో వివాహం నిశ్చమైంది.
ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్లో వివాహం వేడుకకు అన్ని ఏర్పాట్లుచేశారు. వివాహ వేడుకలో భాగంగా, తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ.31 లక్షల నగదు కట్నంగా అందజేశారు.
అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ సున్నితంగా తిరస్కరించారు. తనకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకుమించిన కట్నం తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వరుడు అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా వెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇది సమాజానికి మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.