నితీష్‌కుమార్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్‌!

శనివారం, 26 డిశెంబరు 2020 (09:06 IST)
జనతాదళ్‌ యునైటెడ్‌ (జెడియు) అధినేత నితీష్‌కుమార్‌కు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇచ్చారు. ఈశాన్యరాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు జెడియు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పి.. బిజెపిలో చేరారు.

గత ఏడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏడు స్థానాలు గెలుచుకుని బిజెపి అనంతరం రెండవ పార్టీగా జెడియు అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం జెడియుకి ఒకే ఒక ఎమ్మెల్యే మిగిలారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ ఎమ్మెల్యేలతో పాటు బిజెపి సభ్యుల సంఖ్య 48కి చేరింది. ఎన్‌డిఎ కూటమిలో జెడియు భాగస్వామిగా బీహార్‌ ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నితీష్‌కుమార్‌ పార్టీ రెండోస్థానానికి పడిపోయింది.
 
హయెంగ్‌ మంగ్ఫీ, జిక్కేటాకో, డోంగ్రూ సియాంగ్జు, తాలెంతబో, కంగోంగ్‌ టకు, డోర్జీ వాంగ్డి ఖర్మలు బిజెపిలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకపాలకు పాల్పడుతున్నారంటూ వీరిలో ముగ్గురిని నితీష్‌కుమార్‌ గత నెలలో పార్టీ నుండి సస్పెండ్‌ చేశారు.

కాగా, ఈ వారాంతంలో జెడియు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యవహరంపై నితీష్‌ సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతామని, అయినప్పటికీ బిజెపికి మద్దతు ఇస్తామని, వారికి స్నేహపూర్వక ప్రతిపక్షంగానే ఉంటామని జెడియు నేత కెసి.త్యాగి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు