మీకు పుణ్యముంటుంది అభినందన్‌ను వదిలేద్దాం ... లేదంటే భారత్ చేతిలో భస్మమైపోతాం...

గురువారం, 29 అక్టోబరు 2020 (17:33 IST)
మీకు పుణ్యం ఉంటుంది.. భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను తక్షణం వదలిపెట్టండి... లేదంటే భారత్ చేతిలో భస్మమైపోతాం. ఈ రోజు రాత్రి 9 గంటలకు మనపై దాడి చేసేందుకు భారత్ సిద్ధమైంది అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. అదీ ఈ మాటలు పాకిస్థాన్‌కు చెందిన అఖిలపక్ష పార్టీ నేతల సమావేశంలో. ఆయన వ్యాఖ్యలకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్‌ జావేద్‌ బాజ్వా కూడ ఏకీభవించారు. 
 
ఇంతకీ అభినందన్ విషయం ఇపుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే... గత యేడాది పుల్వామా దాడి తర్వాత పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్‌తో వైమానిక పోరు జరిగింది ఈ పోరులో భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రువులను తరిమికొడుతూ పాక్‌ భూభాగంలోకి దిగారు. తర్వాత భారత్ తెచ్చిన ఒత్తిడి మేరకు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. 
 
అయితే, అభినందన్ విడుదల సంగతి అటుంచితే.. పుల్వామా ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్‌పై అంతకంత బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత్‌ ఉండింది.. ఆ వెంటనే సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపింది.. ఈ సమయంలోనే గత ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అనుకోకుండా పాక్‌ భూభాగంలో దిగారు. 
 
ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయాన్ని తీసుకున్నారు. అది కాస్తా పాక్‌ భూభాగంలో దిగింది. ఈ క్రమంలో అభినందన్‌కు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. అక్కడే ఉన్న పాక్‌ ఆర్మీ అధికారులు అభినందన్‌ను బంధించారు. 60 గంటల పాటు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. ఈ వదిలేయడం వెనుక పెద్ద కథ నడిచిందట!
 
ఆ రోజున విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరుకాలేదు. అప్పుడే ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా రూమ్‌లోకి ఎంటరయ్యారు. అప్పటికే ఆయన కాళ్లు చేతులు వణుకుతున్నాయి. ఒళ్లంతా చెమట పట్టి ఉంది. ఆ సమావేశానికి పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ తదితర పార్టీలు కూడా హాజరయ్యాయి. 
 
ఈ సమావేశం అంతా అయ్యాక మహ్మద్‌ ఖురేషిలో కూడా వణకు మొదలయ్యింది. మీకు పుణ్యముంటుంది... అభినందన్‌ను వదలనివ్వండి. లేకపోతే రాత్రి 9 గంటలకు భారత్‌ మనమీద దాడి చేసేందుకు సిద్ధమవుతోందని ఖురేషి పార్టీలతో మొరపెట్టుకున్నారు. జరగబోయే నష్టాన్ని తెలుసుకున్న విపక్షాలు కూడా ఇందుకు సరే అన్నాయి. ఆ రోజు జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చారు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ నేత ఆయాజ్‌ సాధిక్.
 
ఈ సందర్భం ఎందుకొచ్చిదంటే ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుకు విపక్షాలు చాలా విషయాలలో సహకరించాయని, మద్దతుగా నిలిచాయని అయినప్పటికీ ఆయనలో మార్పు రావడం లేదని సాదిక్‌ చెబుతూ అభినందన్‌ ఘటనను వివరించారు. అభినందన్‌ విడుదల విషయంలో ఇమ్రాన్‌ ప్రభుత్వ నిర్ణయంతో తాము ఏకీభవించినట్టు తెలిపారు. 
 
బుధవారం నేషనల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ ఘటనను పూసగుచ్చినట్టు చెప్పారు. ఇదంతా స్థానిక మీడియాలలో కూడా వచ్చింది. శత్రుదేశానికి చిక్కినా అభినందన్‌ ఏ మాత్రం భయపడలేదు.. అదే ధైర్యాన్ని కనబరిచారు.. అందుకే ఆయనను వీరచక్రశౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు