రాజ్యసభసలో రభస : విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:20 IST)
రాజ్యసభలో రభస సృష్టించినందుకుగాను ఎనిమిది మంది విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ వారం రోజుల పాటు కొనసాగనుంది. 
 
సోమవారం ఉదయం సభ ప్రారంభంకాగానే మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పట్ల విపక్ష సభ్యులు 'అనుచితంగా' వ్యవహరించారనీ... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ ఛైర్మన్ వెంకయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం తదితరులు ఉన్నారు. 
 
ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభలో తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మూజువాణి ఓటుద్వారా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. 
 
ఇదిలావుండగా, వ్యవసాయ బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించినపుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అనుసరించిన వ్యవహారశైలిపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై 12 పార్టీలకు చెందిన 50 మందికిపైగా సభ్యులు సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస నోటీసుపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు