వచ్చే ఎన్నికల్లో జేడీయూకు గుడ్డుసున్నా : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (10:12 IST)
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ మానసికంగా, శారీరకంగా అలసిపోయారన్నారు. అందువల్ల ఈ యేడాది బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. 
 
జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడైన ప్రశాంత్ కిషోర్.. ఏప్రిల్ నెలలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు నితీశ్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారని, అది ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుందని పేర్కొన్నారు. పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ నితీశ్ కుమార్ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటున్నారని విమర్శించారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా పదవి ఉంటుందని నితీశ్ కుమార్ భావిస్తున్నారని పీకే ఎద్దేవా చేశారు. 
 
నితీశ్ కుమార్ వ్యూహానికి అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో జేడీయుకు ఒక్క సీటు కూడా ఇవ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అపుడు మాత్రమే శారీరకంగా అలసిపోయిన, మానసికంగా రిటైరైన ముఖ్యమంత్రి బీహార్ ప్రజలకు దూరం అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు