మోడీ 3.O : ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోడీ

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (19:40 IST)
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు. 
 
ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, సినీనటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. 
 
మోడీ ప్రమాణస్వీకారోత్సవం.. ప్రముఖుల సందడి 
దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవంలో ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు సార్క్‌ సభ్యదేశాల ప్రతినిధులు, ఎన్డీయే భాగస్వామ్యపక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేసిన విదేశీ ప్రముఖుల్లో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె, భూటాన్‌, నేపాల్‌, మారిషెస్‌, సీషెల్స్‌ నేతలు సహా దాదాపు 8 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు.  
 
ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కడ్‌, సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిండే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, సినీనటులు షారుక్‌ ఖాన్‌, రజినీకాంత్‌తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు