జూన్ 14 వరకు లాక్డౌన్ : ఆదివారం అధికారిక ప్రకటన?

శుక్రవారం, 29 మే 2020 (09:19 IST)
కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం అమలు చేస్తున్న లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీన్ని మరో రెండు వారాల పాటు అంటే జూన్ 14వ తేదీ వరకు పొడగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ఉందని సమాచారం. 
 
నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఎక్కువ కావడం వల్ల దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన మంత్రులు, నిపుణులు ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఐదో విడత లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే కనుక నియమ నిబంధనల విషయంలో అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోంది. 
 
అలాగే, పండుగలు, జాతరలు, సామూహిక ప్రార్థనలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలను మాత్రం అనుమతించకూడదని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, బార్లు, పబ్బులతోపాటు విద్యాసంస్థలపై ఇప్పుడున్న నిషేధం అలానే కొనసాగే అవకాశం ఉంది. 
 
అలాగే, అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా నిషేధం కొనసాగనుంది. దేశంలో రైళ్ల రాకపోకలను మాత్రం దశల వారీగా క్రమబద్ధీకరించాలని భావించనున్నారు. ఇందులోభాగంగా, జూన్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్న విషయం తెల్సిందే. ఇకపైతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకలపై నిర్ణయం మాత్రం ఆయా రాష్ట్రాలకే వదిలివేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు