నేడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన

శుక్రవారం, 7 జులై 2023 (12:00 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌తో పాటు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ.12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 
 
అలాగే, వజీద్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం 'టిఫిన్ పే చర్చా' కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత గోరఖ్‌పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కమిటీ ఇటీవల గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహమతి-2021 ప్రకటించింది. 
 
అలాగే, గోరఖ్‌పూర్ - లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. జోధ్‌పూర్ సబర్మతి వందే భారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 
 
ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్ నగర్ మధ్య ఫ్రైట్ కారిడారు, వారణాసి - జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్ చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు