లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల దాష్టీకం.. గర్భిణీపై ట్రాక్టర్ ఎక్కించి చంపేశారు..

శనివారం, 17 సెప్టెంబరు 2022 (16:36 IST)
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టంట్ లోన్ల పేరిట చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వున్నాయి. అయితే జార్ఖండ్‌లో లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు దారుణానికి ఒడిగట్టారు. గర్భిణి అయిన రైతు కూతురుపై ట్రాక్ట‌ర్ ఎక్కించి ఆమె మృతికి కార‌ణం అయ్యారు.
 
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తండ్రి ఓ ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్ట‌ర్ కొనుగోలు చేశారు. వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఏజెంట్లు ట్రాక్ట‌ర్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అనుకున్నారు. 
 
కానీ, రైతుకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వ‌కుండానే ఇంటికి వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఇంటిద‌గ్గ‌ర ఉన్న రైతు కుమార్తెకు, ఏజెంట్ల‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
 
ఆమెపై దాడి చేసి, ప‌క్క‌కు తోసేసి రిక‌వ‌రీ ఏజెంట్లు ట్రాక్ట‌ర్ తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. స‌ద‌రు మ‌హిళ అడ్డు రావ‌డంతో ఆమెపైకి ట్రాక్ట‌ర్ ఎక్కించారు. 
 
తీవ్ర గాయాల పాలైన గ‌ర్భిణిని బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్ప‌టికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు