భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్డుకున్నా లేక ప్రశ్నించినా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ మహిళ చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులంతా కలిసి ఆమెను సజీవదహనం చేశారు.
ఈ దారుణం రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జోధ్పూర్లోని ఓ గ్రామంలో ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగిస్తామని చెప్పగా.. లలిత అందుకు నిరాకరించింది. చెట్ల నరికివేతకు లలిత ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు.