ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో దారుణం జరిగింది. భువనేశ్వర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కి చెందిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి దాటాక రైల్వే స్టేషన్ నుంచి నిఫ్ట్లోని హాస్టల్కు వస్తున్న విద్యార్థినిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కిట్ (కళింగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న నిఫ్ట్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులను చెదరగొట్టారు. రేప్ వార్తలను పోలీసులు ఖండించారు. అటువంటిది జరిగినట్టు తమకు సమాచారమేదీ లేదన్నారు. కాగా, బాధిత విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరోవైపు రేప్ ఆరోపణలను కిట్ యాజమాన్యం ఖండించింది. తమ క్యాంపస్లో అటువంటి ఘటనేమీ జరగలేదని, నిఫ్ట్లో అది జరిగి ఉంటుందని కిట్ స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సుచేత పేర్కొన్నారు. అయితే విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏం జరిగిందో చెప్పకుండా విద్యార్థిని భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.