డిజైనర్ ఆత్మహత్య కేసు : రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామి అరెస్టు

బుధవారం, 4 నవంబరు 2020 (11:44 IST)
ముంబై మహానగరంలో 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అలీబాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అర్నబ్ గోస్వామి కుటుంబ సభ్యులు మాత్రం తమపై దాడి చేసినట్టు, అర్నబ్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్టు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 
 
2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఓ డిజైన‌ర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. 
 
అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌.. అర్న‌బ్ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. మ‌హారాష్ట్ర‌లో ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌త్రికా రంగాన్ని చూడాల్సిన విధానం ఇది కాద‌న్నారు. ఎమ‌ర్జెన్సీ కాలంలో ప్రెస్‌ను ఇలాగే చూశార‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో ఆరోపించారు. 
 
ఇదిలావుంటే అర్బన్ గోస్వామి అరెస్టుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. రాష్ట్రంలో థాకరే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎవరిపై ప్రతీకారం కోసం ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహారాష్ట్రంలో చట్టం అనుసరించబడుతోందని, ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకోవచ్చన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు