#RKNagarElectionResult : డిపాజిట్ కోల్పోయిన డీఎంకే అభ్యర్థి

ఆదివారం, 24 డిశెంబరు 2017 (17:27 IST)
చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థి మరుద గణేష్ డిపాజిట్‌ను కోల్పోయారు. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం, ఆధిపత్యపోరు, నేతల కుమ్ములాటలతో పాటు.. అన్నాడీఎంకే ప్రజా వ్యతిరేక పాలన ఇలా అన్ని అంశాలు తమకు అనుకూలించి ఘన విజయం సాధిస్తామని డీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. 
 
కానీ, ఆర్.కె. నగర్ ఓటర్లు మాత్రం డీఎంకేను షాక్‌కు గురిచేసేలా తీర్పునిచ్చారు. డీఎంకే అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయేలా తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,76,885 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీటీవీ దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అధికార అన్నాడీఎంకే ఇ.మధుసూదనన్‌కు 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదగణేష్‌కు 24,651 ఓట్లు పోలయ్యాయి. దీంతో డీఎంకే అభ్యర్థితో పాటు నామ్ తమిళర్ కట్చి, బీజేపీ అభ్యర్థి కూడా డిపాజిట్లను కోల్పోయారు. కాగా, ఈ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఏకంగా 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు