అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... రాత్రి 11 గంటల వరకు..?

సోమవారం, 11 డిశెంబరు 2023 (10:18 IST)
ఇటీవల ప్రారంభమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రెండో దశలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా, ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనం ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
 
అయ్యప్ప దర్శనాలను గంట ముందుగానే ప్రారంభించడం ద్వారా ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనం పొందుతారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతోపాటు భక్తుల రద్దీ కూడా కొంతమేర తగ్గుతుంది. 
 
అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. వర్చువల్ క్యూ ద్వారా 90 వేలు, అక్కడికక్కడే 30 వేల బుకింగ్‌లు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కొంత అంతరాయం కలుగుతోందని తెలిపారు.
 
అయితే అయ్యప్ప దర్శన వేళలను రోజూ 17గంటలకు మించి పొడిగించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు మంచి నీళ్లు, బిస్కెట్లు అందిస్తున్నామని బోర్డులో పేర్కొన్నారు.
 
ఇక శబరిమల కొండపై జరిగిన తొక్కిసలాటలో 11ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపుతోంది. అయ్యప్ప దర్శనానికి భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో లైన్‌లో దర్శనం కోసం వేచి ఉన్న బాలిక స్పృహ కోల్పోయింది. 
 
వెంటనే పంపా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తమిళనాడులోని సేలంకు చెందిన బాలిక మూడేళ్ల నుంచి గుండె జబ్బుతో బాధపడుతోందని ఆమె బంధువులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి