సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఇకలేరు.. అనారోగ్య సమస్యలతో మృతి

బుధవారం, 15 నవంబరు 2023 (08:16 IST)
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఇకలేరు. ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో సుధీర్ఘకాలంగా బాధపుడతూ వచ్చిన ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సహారా గ్రూపు అధికారికంగా వెల్లడిస్తూ, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. 
 
ప్రాణాంతకత మెటాస్టాటిక్ కేన్సర్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోస్పిరేటరీ అరెస్టు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. 
 
సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ అనే ఇద్దరు కుమారులు ఉండగా, వీరిద్దరూ విదేశాల్లో నివాసం ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్ రాష్ట్రంలోని అరారియాలో పుట్టారు. 1978లో 'సహారా ఇండియా పరివార్' ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. 
 
కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే 'సహారా చిట్ ఫండ్ స్కామ్' కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు