అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జీవితం గడుపుతున్నారు. అయితే, ఈ జైలులో ఆమెకు ప్రాణహాని ఉందని అన్నాడీఎంకే న్యాయవాదులు వాదిస్తున్నారు. అందువల్ల చిన్నమ్మను తక్షణం చెన్నై సెంట్రల్ జైలుకు మార్పు చేయాలని పేర్కొంటూ ప్రత్యేక కోర్టులో ఆమె తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలతో బుధవారం కోర్టులో లొంగిపోగా, ఆ వెంటనే ఆమెను నేరుగా జైలుకు తరలించారు. అదే రోజు రాత్రి నుంచే ఆమెను చెన్నై జైలుకు మార్పించాలంటూ ప్రయత్నాలు మొదలెట్టారు. గురువారం రాత్రికే శశికళ భర్త నటరాజన్ బెంగళూరుకు చేరుకుని సుమారు 40 మందికిపైగా న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పరప్పణ అగ్రహార జైలు అధికారులకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. శశికళకు ప్రాణహాని ఉందని తగిన భద్రత కల్పించాలని నిఘా వర్గాలు జైలు అధికారులకు సమాచారం చేరవేశారు. ప్రస్తుతం నిఘావర్గాల సమాచారాన్ని ముందుంచుకున్న శశి న్యాయవాదులు, పరప్పణ అగ్రహార జైలు నుంచి చెన్నై జైలుకు మార్పు చేయాలని శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనివెనుక పెద్ద ప్లాన్ దాగివుంది. పరప్పన అగ్రహార జైలులో ఉంటే తమిళ రాజకీయాలను నడపడం సాధ్యం కాదని పైగా కేవలం ఖైదీగా మాత్రమే జీవితం గడపాల్సి వస్తుంది. అదే చెన్నై జైలుకు మార్చితే.. లగ్జరీ జీవితం.. అంటే ఇంట్లో ఉన్నట్టుగానే జీవితాన్ని అనుభవించవచ్చు. సకల సౌకర్యాలు అనుభవించవచ్చు. దీనికి కారణం రాష్ట్రంలో తన కనుసైగలతో నడిచే అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండటమే. అందుకే చెన్నై జైలుకు మార్చాలని పట్టుబడుతున్నారు.
అయితే, తమిళనాడు ప్రభుత్వ నిఘా వర్గాలు చేసిన సూచనలపై కర్ణాటక నిఘా వర్గాలు నిశితంగా అధ్యయనం చేస్తున్నాయి. గతంలో ఇదే జైలులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా గడిపారు. దీనికితోడు బెంగళూరులో బాంబు పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ మదనితోపాటు ఐసిస్, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నవారు సైతం జైలులో ఉన్నారు. అప్పుడు లేని బెదిరింపులు శశికళకు ఎలా వచ్చాయనేది..? కర్ణాటక పోలీసు విభాగం సూక్ష్మంగా పరిశీలిస్తోంది.