మంగళవారం రాత్రి నుంచి తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం గత 12 గంటల్లో రెండోసారి బుధవారం మీడియా ముందుకు వచ్చారు. అసెంబ్లీలో బలపరీక్షకు కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. పార్టీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
‘అమ్మ’ చికిత్సకు సంబంధించిన హెల్త్ రికార్డులన్నీ వెలుగులోకి తీసుకొచ్చేలా విచారణ కోరతామన్నారు. తమిళనాడుకు సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, అధికారంలో ఉన్నప్పుడు గానీ పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నానన్నారు.